అహ్మదాబాద్: ఒక గుంపు పోలీసులపై దాడి చేసింది. (Mob Attacks Police) వారి అదుపులో ఉన్న రౌడీ షీటర్ను విడిపించింది. ఈ దాడిలో ఎస్ఐకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పలు నేరాలకు సంబంధించి కేసులున్న రౌడీ షీటర్ జలసింహా జలా పరారీలో ఉన్నాడు. అయితే అతడు జింజువాడ సమీపంలోని గ్రామంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం జింజువాడ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కేసీ దంగర్, ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రైవేటు కారులో ఆ గ్రామానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న జలాను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కారులో తిరిగి వెళ్తుండగా గ్రామం శివారులో రౌడీ షీటర్ జలా అనుచరులు, మరి కొంత మంది కలిసి పోలీసులను అడ్డుకున్నారు. కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో జలా పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడు.
మరోవైపు గుంపు దాడిలో ఎస్ఐ దంగర్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా ఇద్దరు కానిస్టేబుల్స్ స్వల్పంగా గాయపడినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారైన జలా, పోలీసులపై దాడి చేసిన గుంపును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.