ముంబై : మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పట్టుపడుతున్న నేపధ్యంలో శుక్రవారం 30 మందికి పైగా ముస్లిం నేతలు ఎంఎన్ఎస్కు రాజీనామా చేశారు. రాజ్ ఠాక్రే హిందుత్వ అనుకూల వైఖరి తీసుకున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 మంది స్ధానిక నేతలు పార్టీని వీడటం కలకలం రేపింది. ముంబై, మరాఠ్వాటా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముస్లిం నేతలు పార్టీకి గుడ్బై చెప్పారు.
మసీదుల్లో లౌడ్స్పీకర్లు నిషేధించాలనే డిమాండ్పై రాజ్ ఠాక్రే పట్టుబడుతుండగా ఆయన వైఖరికి నిరసనగా ఎంఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఠాక్రేకు తన రాజీనామా లేఖ పంపారు. ఈ లేఖను ఇర్ఫాన్ షేక్ ఫేస్బుక్లో షేర్ చేశారు. ఓ వర్గానికి వ్యతిరేంగా విద్వేష వైఖరి తీసుకోవడం మీ వైపు నుంచి మీకు తప్పుగా తోచనప్పటికీ ఏదో జరుగుతోందని తమకు అనిపిస్తోందని తన రాజీనామాను ఆమోదించాలని ఆయన ఆ లేఖలో ఠాక్రేను కోరారు.
కాగా ఏప్రిల్ 2న శివాజీ పార్క్లో జరిగిన ర్యాలీలో రాజ్ ఠాక్రే మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ చర్య చేపట్టని పక్షంలో మసీదుల వెలుపల తాము భారీ శబ్ధాలతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. ఏప్రిల్ 12న థానేలో జరిగిన ర్యాలీలోనూ మే 3లోగా మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్కు అల్టిమేటం జారీ చేశారు.