Raj Thackeray : మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో వీరి భేటీ జరిగింది. బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో వీరి సమావేశం జరిగింది. అమిత్ షాతో భేటీకి ముందు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్లో వినోద్ తావ్డేతో రాజ్ థాకరే సమావేశమయ్యారు.
ఈ భేటీల నేపథ్యంలో రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పార్టీ ఎన్డీఏలో చేరనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూటమి తరఫునే ఎంఎన్ఎస్ అభ్యర్థులు పోటీ పడబోతున్నారనే ప్రచారం జరుగుతన్నది. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు.