MLC Kavitha | న్యుఢిల్లీ, ఏప్రిల్ 15: ‘ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు రాజకీయ కుట్రలో భాగంగానే కొన‘సాగు’తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేవలం ఒకరోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. చార్జిషీట్లో కవిత పేరు లేకపోయినా సాక్షిగా విచారణ చేసిన ఈడీ ఎన్నికల ముందు ఏకపక్ష దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది. అదేబాటలో సీబీఐ కూడా పయనిస్తున్నది. లోక్సభ ఎన్నికల్లో కవిత బీఆర్ఎస్ తరఫున స్టార్ క్యాంపెయినర్గా కీలకపాత్ర పోషిస్తారని తెలిసిన తర్వాతే ఈడీ, సీబీఐ దర్యాప్తు వేగాన్ని పెంచాయి. ఆమె నిరంతరం జైల్లోనే ఉండేలా దర్యాప్తు సంస్థలు కుట్రలు చేస్తున్నాయి’ అంటూ కవిత బెయిల్ పిటిషన్లో ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. మద్యం విధానం వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం 664 పేజీలతో కూడిన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు మంగళవారం విచారణ జరిపే అవకాశం ఉన్నది.
ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈడీ, ఆ తరువాత సీబీఐ అరెస్టు చేశాయని, ఇదంతా ఓ కుట్రలో భాగంగానే జరుగుతున్నదని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. పది రోజుల్లో నామిషన్ల ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో సీబీఐ అరెస్టు చేసిందని, ఈడీ వేసిన ప్రశ్నలనే సీబీఐ కూడా వేస్తున్నదని తెలిపారు. ‘కొత్త విషయాలు అడగటం లేదు. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుంది. జవాబు తెలియకపోతే తెలియదనే చెప్తాం. అదే ప్రశ్నను తిప్పితిప్పి ప్రశ్నించినప్పుడు మౌనం వహిస్తే.. దీనిని దర్యాప్తునకు సహకరించడం లేదని అంటున్నారు. కేసు దర్యాప్తును కొన‘సాగ’దీస్తూ పిటిషనర్ను నిరంతరం జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. నిజానికి దర్యాప్తు సంస్థల వద్ద ఆధారాలు లేవు. సీఆర్పీసీలోని సెక్షన్ 439, 437ల ప్రకారం సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలి. కవిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షల నివేదికలు, మందుల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 20 ఏండ్ల క్రితం కవిత చేతి మణికట్టు వద్ద ఎముక విరిగిందని, గర్భాశయం, అండాశయంలో సమస్యలున్నాయని, ఇందుకు ఆమె ఔషధాలు తీసుకుంటున్నారని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు ఆమెకు హైబీపీ వచ్చిందని తెలిపారు. ఆ రోజు రాత్రి 3:35 కి వైద్యులు లెబెటేలాల్ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆ తర్వాతే బీపీ సాధారణ స్థాయికి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కవితకు ఉన్న ఇద్దరు కుమారుల్లో ఒకరు మైనర్ అని, వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉన్నదని తెలిపారు.
‘కవితకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ మద్యం విధానం నిర్ణయంలో కవితకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ కోశాన సంబంధం లేదు. అయినా దర్యాప్తు సంస్థలు ఆమెను కేసులో ఇరికించేందుకు సర్వశుక్తులు ఒడ్డుతున్నాయి. 2022 డిసెంబర్లో సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం కవితను ఆమె నివాసంలో సీబీఐ విచారించింది. దినేశ్ అరోరా, శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘ వ, బుచ్చిబాబు అప్రూవర్లుగా మారిన వెంటనే వాళ్లకు బెయిల్ వచ్చింది. ఇతర నిందితులు విజయ్ నాయర్, చరణ్ప్రీత్సింగ్, అరవింద్కుమార్సింగ్కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహిళ అయిన కవితకు కూడా బెయిల్ ఇవ్వాలి. బెయిల్ పొందేందుకు ఆమె అన్ని విధాలా అర్హురాలు’ అని పేరొన్నారు.
గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్కుమార్ చేసిన వ్యాఖ్యల గురించి కవిత తన బెయిల్ పిటిషన్లో ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు తొలి దశలో ఉండగా, 2022 డిసెంబర్ 4న బండి సంజయ్.. కవిత అరెస్ట్ తప్పదని వ్యాఖ్యానించారని తెలిపారు. ‘అప్పుడు బండి చెప్పిన జోస్యమే నిజమైంది. అప్పుడే నేను షాక్కు గురయ్యాను. ఆనాటి బండి సంజయ్ ప్రకటనను గమనంలోకి తీసుకుంటే వాస్తవాలను బేరీజు వేస్తే పిటిషనర్ కవితపై అభియోగాలకు ఆధారాలే లేవని స్పష్టమవుతుంది. దీనికితోడు కేంద్ర సంస్థల దర్యాప్తు ఏకపక్షంగా సాగుతున్నది. నిష్పక్షపాతంగా జరగడం లేదు. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నదని నిరూపించేందుకు దర్యాప్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి ఈ కేసుతో కవితకు సంబంధం లేదని దర్యాప్తు అధికారులకు కూడా తెలుసు’ అని వివరించారు.