Maharashtra | ముంబై: లోక్సభ ఎన్నికల ముందు వరకు స్నేహగీతం పాడిన మహారాష్ట్ర పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి(ఎన్డీయే)లో, ఇటు మహావికాస్ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి పదవుల కేటాయింపు మహాయుతిలో చిచ్చు పెట్టగా, ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల పంపకం మహావికాస్ అఘాడీలో మంటలు రాజేసింది. దీంతో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
మహారాష్ట్రలో ఆశించిన లోక్సభ స్థానాలు దక్కకపోవడంతో మహాయుతి కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింట ఎన్సీపీ(అజిత్ పవార్)వర్గం ఓడిపోయింది. బీజేపీ సరిగ్గా పని చేయకపోవడమే ఇందుకు కారణమని అజిత్ పవార్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం తమకు నష్టం చేసిందని బాహాటంగానే చెప్పారు. పైగా ఎన్సీపీకి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కలేదు. ఆ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్కు సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ చెప్పగా ఎన్సీపీ తిరస్కరించింది. మరోవైపు ఒకే ఒక్క సహాయ మంత్రి పదవి ఇవ్వడం పట్ల శివసేన(ఏక్నాథ్ షిండే) వర్గం బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. బీజేపీ కంటే తామే మంచి ఫలితాలు సాధించామని, తాము 15 సీట్లలో పోటీ చేసి ఏడు గెలిస్తే, బీజేపీ 28 పోటీ చేసి కేవలం 9 మాత్రమే గెలిచిందని ఆ పార్టీ చీఫ్ విప్ శ్రీరంగ్ బర్నే అన్నారు. తక్కువ సీట్లు వచ్చిన పార్టీలకు మంత్రి పదవులు దక్కాయనడం ఎన్డీయేలో అసంతృప్తిని బయటపెట్టింది.
మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఎంవీఏలోనూ విభేదాలు మొదలయ్యాయి. శాసనమండలి ఎన్నికలు కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మధ్య చిచ్చు రేపాయి. ప్రస్తుతం నాలుగు పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు స్థానాలకు తాము పోటీ చేసి, మరో రెండింటిని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)కు వదిలేయాలని కాంగ్రెస్ భావించింది. అయితే, ఉద్ధవ్ ఠాక్రే మొత్తం నాలుగు స్థానాలకు తామే పోటీ చేస్తామని ప్రకటించారు. దీనిని పీసీసీ చీఫ్ నానా పటోలే తప్పుపట్టారు. తమను సంప్రదించకుండానే ఠాక్రే ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. తర్వాత కూడా దీనిపై స్పందించడం లేదని పేర్కొన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.