MK Stalin : తమిళనాడుకు నిధుల కేటాయింపుపై ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాలు చెబుతున్నారని సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం ఆరోపించారు. ఏయే లబ్ధిదారులకు నిధులు కేటాయించారో ప్రధాని మోదీ వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరెవరికి మీరు నిధులు పంపిణీ చేశారో వారి వివరాలు వెల్లడిస్తే ఆయా వ్యక్తులకు ఏమైనా ఆర్ధిక సాయం అందిందా లేదా అని తాము విచారణ చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. విపత్తు సమయంలో రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించలేదని స్టాలిన్ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
తమిళనాడులోని ఎనిమిది జిల్లాల ప్రజలు రెండు జాతీయ విపత్తుల్లో తీవ్రంగా దెబ్బతిన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల సాయం కోసం తాము 37,000 కోట్ల నిధులు కోరినా ప్రధాని మోదీ తమిళనాడు ప్రజలకు కనీసం ఒక్క రూపాయి సాయం కూడా విదల్చలేదని స్టాలిన్ ఆరోపించారు. అయినా ప్రధాని మోదీ అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర విపత్తు నిధుల నుంచి తమిళనాడు ప్రభుత్వం రూ. 3500 కోట్లు కేటాయించిందని స్టాలిన్ గుర్తుచేశారు.
ఇక ఇటీవల చెన్నై పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ డీఎంకేపై ఆరోపణలు గుప్పించారు. తుపాను సందర్భంగా డీఎంకే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించిన మోదీ ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వారి కష్టాలను మరింత పెంచిందని దుయ్యబట్టారు. వరద సాయం మరిచిన డీఎంకే నేతలు మీడియా మేనేజ్మెంట్లో మునిగితేలారని ఎద్దేవా చేశారు. కేంద్రం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తోందని, దీంతో డీఎంకే నేతలకు దిక్కుతోచడం లేదని అన్నారు. తమిళనాడు ప్రజల సొమ్మును మీరు లూటీ చేయడాన్ని మోదీ ఆమోదించడని తాను డీఎంకే నేతలకు చెప్పదలుచుకున్నానని చెప్పారు. మీరు దోచుకున్న సొమ్మును రాబట్టి రాష్ట్ర ప్రజల కోసం వెచ్చిస్తామని ఇది ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారంటీ అని అన్నారు.
Read More :