లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పది జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో గురువారం జరిగే పోలింగ్లో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బలరాంపూర్, సిద్ధార్ధ్నగర్, మహరాజ్గంజ్, ఖుషీనగర్, బస్తి, సంత్ కబీర్నగర్, అంబేద్కర్ నగర్, డియోరియా, బలియా సహా యోగి స్వస్ధలమైన గోరఖ్పూర్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. పూర్వాంచల్గా పేరొందిన తూర్పు యూపీలో ఆరో దశ పోలింగ్ కీలకంగా మారింది. గోరఖ్పూర్ నుంచి సీఎం యోగి ఆదిత్యానాధ్ పోటీ చేస్తున్నారు.బహుజన, దళితుల ప్రాబల్యం కలిగిన ఈ ప్రాంతంలో బీఎస్పీ కూడా ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇవ్వనుంది.
2017లో బీఎస్పీ 19 స్ధానాల్లో గెలుపొందగా ఈ ప్రాంతంలో ఆ పార్టీ 5 స్ధానాలను కైవసం చేసుకుంది. ఓబీసీల ఓట్లను ఆకర్షించి ఎస్పీని దెబ్బకొట్టేందుకు మహరాజ్గంజ్ ఎంపీ, కేంద్ర మంత్రి, కుర్మి నేత పంకజ్ చౌధరిని బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. బీసీలకు మోదీ ప్రభుత్వంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత లభిస్తోందని ఆయన చెబుతున్నారు. బీజేపీ హయాంలోనే యూపీలో ఎక్స్ప్రెస్ వేలు శరవేగంగా పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రాంతంలో కుర్మి-పటేల్, చౌరాసియా, నిషాద్, యాదవ్, మౌర్య, చౌహాన్, నాయీ, లోహర్ వంటి ఓబీసీ కులాలు అధికంగా ఉన్నాయి.
మొత్తం ఓటర్లలో బ్రాహ్మణులు 12 శాతం వరకూ ఉన్నారు. యాదవులు ఇతర ఓబీసీలు, ముస్లిం ఓట్ల మద్దతుతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ పావులు కదుపుతుండగా యాదవేతర ఓబీసీలు, బ్రాహ్మణులు ఇతర అగ్రకులాల అండదండలతో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దళితుల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.