బెంగళూరు, నవంబర్ 3: కర్ణాటకలో కరెంట్ కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఎడాపెడా కరెంట్ కోతలతో గ్రామాల్లో తాగు నీరు దొరకడం కూడా కష్టంగా మారిందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం నెలకొన్న విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి స్వయంగా అంగీకరించారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర రైతాంగానికి 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నామని మంత్రి రామలింగారెడ్డి తాజాగా ఓ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పేర్కొన్నారు. 5 గంటల కరెంట్ తమకు చాలడం లేదని కర్ణాటక రైతులు చేస్తున్న ఆందోళనలపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. కర్ణాటకలో కరెంట్ కష్టాలు వాస్తవమేనన్న విషయాన్ని అంగీకరించారు. రాష్ట్రంలో సరిగా వర్షాలు పడలేదని, డ్యాముల్లో నీరు లేదని అన్నారు. దీని కారణంగా విద్యుత్తు ఉత్పత్తి కావడం లేదని, 7 గంటల విద్యుత్తు ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో పక్క రాష్ర్టాల నుంచి కరెంట్ కొని రైతులకు కరెంట్ ఇస్తామని పేర్కొన్నారు.
విద్యుత్తు విషయంలో హస్తం పార్టీ రాష్ట్రంలో రైతులను నిలువుగా మోసం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కీలకమైన ఈ హామీ విషయంలో యూటర్న్ తీసుకొని రైతన్నకు అరకొరగా, అది కూడా ఎడాపెడా కోతలతో కరెంట్ ఇస్తున్నది. రోజులో విడతల వారీగా ఐదు గంటల కరెంట్ ఇస్తాం.. పండుగ చేస్కోండి’ అనే విధంగా కాడి వదిలేసి ఆ పార్టీ మంత్రులు, నేతలు ప్రకటనలు చేస్తుండటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. సరిపడా కరెంట్ రాక, నీళ్లు పారక పలుచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోతల్లేని విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో రైతులు విద్యుత్తు కార్యాలయాల ముందు ఆందోళనలు కూడా నిర్వహించారు. పలు రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్నదాతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లోనూ కరెంట్ సంక్షోభం నెలకొన్నది. కరెంట్ కొరత, అధిక విద్యుత్తు ధరల కారణంగా రాష్ట్రంలో కీలకమైన మార్బుల్ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ మార్కెట్గా పేరుగాంచిన కిషన్గఢ్లో యాజమాన్యాలు కరెంట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.