రష్యా- ఉక్రెయిన్ మధ్య వాతావరణం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కారం చేసుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఇరు దేశాలు చర్చల జరుపుకుంటూ, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచించారు. చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపన జరగాలన్నదే తాము కోరుకుంటున్నామని, భారత్ పంథా కూడా అదేనన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం ఇప్పటికే చొరవ తీసుకుంటోందని, అయినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదన్నారు.
ప్రపంచ పరిణామల దృష్ట్యా చూసినా, ఇరు దేశాల మధ్య చూసినా… యుద్ధం అనేది అంత శ్రేయస్కరం కాదని రాజ్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తమకున్న సమాచారం ప్రకారం ఇదే విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్,అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇదే విషయంపై చర్చలు జరిపే అవకాశ ఉందని, దీని ద్వారా ఓ పరిష్కారం లభించే ఛాన్స్ ఉందని రాజ్నాథ్ పేర్కొన్నారు.