న్యూఢిల్లీ : ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు భూమిపూజ చేయడం గొప్పగా, ఆనందంగా, గర్వంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్కు భూమి పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరింది అని చెప్పారు. ఇవాళ ఢిల్లీ నగరం నడిబొడ్డుపైన గులాబీ జెండాను ఎగురవేయడం మరిచిపోలేని విషయమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరును దేశం నలుమూలల తెలియజేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీపై ఉందన్నారు. అందుకు ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్ ఒక వేదిక కాబోతుందని అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఢిల్లీ అధికారులు, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.