వనపర్తి : ఒక్కటి కాదు, రెండు కాదు 50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ఆముదంబండ తండా, గార్లబండ తండాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి మార్నింగ్ వాక్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తుందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు, గృహాలు, పారిశ్రామిక అవసరాలకు సైతం 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మన ఊరు – మన బడి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, పల్లె పగ్రతి, పట్టణ ప్రగతిలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, గత ఎనిమిదేళ్ల అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సాగునీరందించి పంటల సాగు ప్రోత్సహించామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పంటలను కొనుగోలు చేశామన్నారు. ఎనిమిదేళ్ల ఎన్నో చేశామని.. ఇంకా ఏం కావాలి? సమస్యలు ఏంటో చెబితే పరిష్కరించే బాధ్యత మాదేనంటూ భరోసా ఇచ్చారు.
గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే తమ ఉద్దేశమన్నారు. తమ ఆలోచనలను ప్రజలు స్వాగతించారని, ఊరూరా వచ్చిన స్పందన ఎంతో ప్రోత్సాహం అందించిందన్నారు. భవిష్యత్లో అందరి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లె నిద్రలు నిర్వహిస్తామన్నారు. 41 గ్రామాల్లో, తొమ్మిది వార్డుల్లో, ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో 53శాఖల అధికారులతో పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.