(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కూలీల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొంటున్నది. విపక్ష రాష్ర్టాలకు రూ.5 వేల కోట్ల మేర నిధులను విడుదల చేయడంలో తాత్సారం ప్రదర్శించడమే ఇందుకు రుజువు. ఈ జాప్యానికి అకారణంగా రాష్ర్టాలను బాధ్యులుగా చేయడం, తద్వారా ఎన్నికల్లో లబ్ధికి యత్నించడం కేంద్రానికి పరిపాటిగా మారిపోయింది. మొన్న బీహార్, నిన్న తెలంగాణ, నేడు బెంగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. మరోవైపు, తాము చేసిన పనికి పైసలు ఎందుకివ్వరని ఉపాధి హామీ పథకం కూలీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. రావ్సాలిన బకాయిలు రాకపోతే పెరిగిన ధరలతో ఎలా బతకాలని వాపోతున్నారు.
బెంగాల్లో ఉపాధి రగడ
ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని పేర్కొంటూ పశ్చిమ బెంగాల్కు విడుదల చేయాల్సిన రూ. 2,744 కోట్ల బకాయిలను కేంద్రం నిలిపేసింది. ఉపాధి హామీ పథకం చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. పథకంలో అవినీతి జరిగితే దర్యాప్తు జరుపుకోవచ్చని, అయితే బకాయిల చెల్లింపులో జాప్యం చేయొద్దని.. అలా జరిగితే కూలీలు ఇబ్బందులకు గురవుతారని మమత సర్కారు ఎంత చెప్పినా కేంద్రం వినట్లేదు.
తెలంగాణలో అలా.. బీహార్లో ఇలా..
తెలంగాణకు రావాల్సిన రూ.140 కోట్ల ఉపాధి హామీ బకాయిలను కేంద్రం నిలిపేసింది. ఈ పథకం కింద సిమెంటు కల్లాల్ని నిర్మించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే, ఆ నిర్ణయాన్ని తప్పు బట్టింది. రూ.151 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఆగస్టులో బీజేపీతో తెగదెంపులు చేసుకొని, విపక్ష ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కేంద్రం.. ఆ రాష్ర్టానికి రూ.1,100 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది.
విపక్ష రాష్ర్టాలకు ఉపాధి హామీ బకాయిలు
రాష్ట్రం : బకాయిలు (రూ. కోట్లలో)
పశ్చిమ బెంగాల్ : 2,744
బీహార్ : 1,100
కేరళ : 456
తమిళనాడు : 210
జార్ఖండ్ : 162
తెలంగాణ : 140
రాజస్థాన్ : 108