న్యూఢిల్లీ : బాలీవుడ్ మూవీ కశ్మీర్ ఫైల్స్ను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం కశ్మీరీ పండిట్ల బాధలను ఆగ్రహంగా మార్చే ప్రయత్నం చేస్తోందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ను కేంద్రం విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా కశ్మీర్ పండిట్ల బాధను ఆయుధీకరణ చేస్తున్న తీరు ప్రభుత్వ చెడు ఉద్దేశాలను బహిర్గతం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు.పాత గాయాలను మానేలా చేసి ఇరు వర్గాల మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పడానికి బదులు వారిని ఉద్దేశపూర్వకంగా విడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 1990 ప్రాంతంలో కశ్మీర్ పండిట్లను కాశ్మీర్ నుంచి వెళ్లగొట్టేందుకు జరిగిన హింసను కండ్లకు కడుతూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్ను తెరకెక్కించారు.
ఈ సినిమా వాస్తవాలను సరైన రీతిలో ఆవిష్కరించిందని ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమాకు మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాయి. మరోవైపు కశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శించని థియేటర్ల వద్ద హిందూ అనుకూల సంస్ధలు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ సినిమా ప్రదర్శించనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిరసనకారులు ఆగ్రాలోని ధియేటర్ యజమానులను హెచ్చరిస్తుండటంతో ధియేటర్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగ్రాలోని సంజయ్ టాకీస్ వద్ద నిరసనకారులు ప్లకార్డులతో ధర్నాకు దిగారు. కుట్రతోనే ఈ సినిమాను పలు ధియేటర్లలో ప్రదర్శించడంలేదని నిరసనకు నేతృత్వం వహించిన హిందూ అనుకూల సంస్ధ ప్రెసిడెంట్ గోవింద్ పరాశర్ ఆరోపించారు.ఇక కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం హిందూ అనుకూల సంస్ధల నిరసనను భారతీయ ముస్లిం అభివృద్ధి మండలి ఛైర్మన్ సమీ అఘాయ్ తప్పుపట్టారు. హిందూ సంస్ధలకు కశ్మీర్ పండిట్లపై నిజంగా ప్రేమ ఉంటే 30 ఏండ్లుగా మౌనంగా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. వారిని తిరిగి కశ్మీర్కు తిరిగి తీసుకువచ్చేవారని వ్యాఖ్యానించారు. ఏ సినిమా ప్రదర్శించాలో ధియేటర్ నిర్వాహకుల హక్కని నిరసనకారులు దీన్ని ఎలా నిర్ణయిస్తారని అన్నారు.