శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పోలీసుల తీరుపై పీడీపీ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు తనను హౌజ్ అరెస్ట్ చేశారని, తన ఇంటికి బయటి నుంచి తాళం పెట్టారని ఆరోపించారు. తాను మాజీ ముఖ్యమంత్రిని అని కూడా చూడకుండా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని విమర్శించారు.
పట్టన్లో తన పార్టీ కార్యకర్త పెండ్లికి వెళ్లేందుకు బయలుదేరితే అడ్డుకున్నారని తెలిపారు. ట్విట్టర్లో ఈ వివరాలను పేర్కొంటూ తన ఇంటికి గొళ్లెం పెట్టి ఉన్న ఫొటోనూ షేర్ చేశారు. ముఫ్తీ ట్వీట్ పోస్ట్ అయిన 40 నిమిషాలకు జమ్ముకశ్మీర్ పోలీసులు దానిపై స్పందించారు. మెహబూబా ముఫ్తీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.
హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్బంగా తాము ఆమెపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని చెప్పారు. మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోనే తాము ఆమె ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టలేదనే విషయాన్ని నిరూపిస్తుందన్నారు. ఎందుకంటే ముఫ్తీ పోస్ట్ చేసిన ఫొటోలో ఉన్నది అమె ఇంటి బయటి గేటుకు లోపలి నుంచి పెట్టిన గొళ్లెమని పేర్కొన్నారు.