Mehbooba Mufti | కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐలపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ కూల్చివేత క్రెడిట్ మొత్తం సీబీఐ, ఈడీలదేనని సోమవారం మీడియాతో చెప్పారు. ఈనాడు ఏక్నాథ్ షిండే 50-60 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయని, అందువల్లే (మహారాష్ట్ర) ఎంవీఏ సర్కార్ కూలిపోయిందన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కూల్చివేతలో బీజేపీ, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే చేసిందేమీ లేదని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. దేశం అభివృద్ధి కోసం పని చేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమర్నాథ్ యాత్రికులు జమ్ముకశ్మీర్ ప్రజలకు అతిథులని మెహబూబా ముఫ్తీ అన్నారు. వారికి మంచి ఆతిథ్యం కల్పించడం తమ అందరి బాధ్యత అన్నారు. కానీ, ఎవరిపై దాని ప్రభావం పడుతుందో కూడా ఆలోచించాలన్నారు. అమర్నాథ్ యాత్రికులకు సౌకర్యాల కల్పన వల్ల స్థానికులకు ఇబ్బందులు తలెత్తవద్దన్నారు.