న్యూఢిల్లీ: మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయొద్దో చెప్పాలని మేఘాలయలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ (Speaker) నోటీసులు జారీచేశారు. నవంబర్ 25న మాజీ సీఎం ముకుల్ సంగ్మా నేతృత్వంలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లో (TMC) చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంపరీన్ లిగ్డో శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో టీఎంసీ శాసన సభాపక్ష నేత ముకుల్ సంగ్మాతోపాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో సూచించారు.
60 మంది సభ్యులు కలిగిన మేఘాలయ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. అయితే పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా.. తన 10 మంది మద్దతుదారులతో కలిసి టీఎంసీలో చేరారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.