న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ సాయంత్రం ఢిల్లీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లు భేటీ కానున్నాయి. లోక్సభ బీఏసీ సమావేశానికి స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ బీఏసీ సమావేశానికి చైర్మన్ జగదీప్ ధన్కర్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బిల్లులు, ఇతర అంశాలు, వాటికి సమయం కేటాయింపు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా తాము లేవనెత్తదల్చుకున్న అంశాలను, డిమాండ్లను ఈ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నాయి. ప్రభుత్వం వాటికి కూడా సభలో సమయం కేటాయించనుంది. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 7 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 16 కొత్త బిల్లులు ఆమోదం కోసం ఉభయసభల ముందుకు రానున్నాయి.