న్యూఢిల్లీ, ఆగస్టు 4: ‘నోరు మూసుకోండి.. లేదంటే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మీ ఇంటికి వస్తుంది’.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. సాక్షాత్తూ నిండు పార్లమెంటులో విపక్ష సభ్యులను మంత్రి బెదిరించిన తీరిది. ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టేందుకు మాత్రమే ఈడీ పనిచేస్తున్నదని, దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కేంద్రంలో మోదీ సర్కారు ఈడీని దుర్వినియోగం చేస్తున్నదని తీవ్ర విమర్శలు వినిపిస్తున్న వేళ.. కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఆ విమర్శలు నిజమేనని తేల్చేశాయి.
మోదీని ప్రశ్నించిన ప్రతి విపక్ష నేతనూ జైల్లో పెట్టేందుకు ఈడీ వెంటనే రంగంలోకి దిగుతుందన్న అపవాదు ఉన్నది. అయితే, ఇంతకాలం ఈ దాడులు, కక్షసాధింపుల పరంపర వ్యవహారం తెరవెనుక జరిగేది. మీనాక్షి లేఖి బెదిరింపులతో ఆ తెర తొలగిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంటులోనే దేశమంతా చూస్తుండగానే ఓ ఎంపీని బెదిరించటం ఈడీ పనితీరును తేటతెల్లం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. గురువారం ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై మీనాక్షి లేఖి లోక్సభలో మాట్లాడుతుండగా, విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. ‘ఆగండి.. ఆగండి.. నోరు మూసుకోండి.. లేదంటే మీ ఇంటికి ఈడీ వస్తుంది’ అని బెదిరించారు.
ఇంత బరితెగింపా?
ఈడీని కేంద్రం తన రాజకీయ కక్షసాధింపుల కోసం వాడుకొంటున్న తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రమంత్రి మాటలు సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకుడు భరత్రెడ్డి మండిపడ్డారు. ‘ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలను మీనాక్షి లేఖి బెదిరింపులు నిజం చేశాయి’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి ైక్లెడ్ క్యాస్ట్రో ట్వీట్ చేశారు. ‘పార్లమెంటులోనే కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఓ సభ్యుడిని తీవ్రంగా బెదిరించారు. రాజకీయ ప్రతీకారం ఇప్పుడిక రహస్యం కాదు’ అని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు.