న్యూఢిల్లీ, ఆగస్టు 11 : సామాన్యుడికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఏర్పాటైన బ్యాంకుల శాఖలు మూతపడుతున్నాయి. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఉద్యోగులను నియామకాలకు చెక్పెట్టడానికి పలు ప్రభుత్వరంగ సంస్థలు భారీ స్థాయిలో శాఖలను మూసివేస్తున్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా బ్రాంచ్ శాఖలు మూతపడ్డాయి. ఈ విషయాన్ని రాజ్యసభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2021-22లోనే 2,564 శాఖలు మూతపడగా, ఆ తర్వాత సంవత్సరంలో 700 శాఖలు మూతపడినట్టు చెప్పారు.
వ్యాపార విస్తరణ కోసం గడిచిన ఐదేండ్లలో పీఎస్బీలు 6 వేలకు పైగా శాఖలను ఆరంభించాయి. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో 6,255 శాఖలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చాయన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,967 శాఖలను ప్రారంభించిన బ్యాంక్లు, అంతకుముందు ఏడాదిలో 1,823 శాఖలను ఒపెన్ చేశాయి. విల్ఫుల్ డిఫాల్టర్లు తగ్గుముఖం పట్టారని మంత్రి చెప్పారు. రూ.25 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారు 15,930 మంది ఉన్నారని, వీరి మొత్తం రుణం రూ.2.85 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు, జూన్ 30, 2025 నాటికి రూ.90,545 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్ డిపాజిట్లు జనవరి 31, 2026 నాటికి ఇవి రూ.98,073 కోట్లకు పెరిగాయి.
