న్యూఢిల్లీ: దేశంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసే కొత్త వైద్య కళాశాలల్లో గరిష్ఠంగా 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే ఉంటాయని, పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిని ఆయా రాష్ర్టాలు పాటించాలని జాతీయ వైద్య కమిషన్ (ఎంఎన్సీ) మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజీలో నైపుణ్య ప్రయోగశాల ఉండాలని, దీనిని క్లినిక్ శిక్షణ, పరీక్షల నిర్వహణకు వినియోగించరాదని తెలిపింది.
ఇతర మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులకు ఆరు వారాల పాటు స్కిల్ ల్యాబ్లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారిని క్లినికల్ శిక్షణకు పంపడం తప్పనిసరి. ఫ్యాకల్టీ, రెసిడెంట్ డాక్టర్లు సహా అందరికీ 75 శాతం హాజరు ఉండాలి. లైబ్రరీ, లేబరేటరీ, సీసీ కెమెరాలు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, లెక్చర్ థియేటర్ సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని ఎంఎన్సీ మార్గదర్శకాలను విడుదల చేసింది.