ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతలతో యావత్తు దేశం ఉలిక్కిపడింది. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఇటీవల ప్రత్యక్షంగానే విమర్శించారు. దేశంలోని అన్ని ప్రధాన ఇంగ్లిష్ వార్తాపత్రికలు గడిచిన మూడురోజుల్లో తమ సంపాదకీయాల్లో.. పెచ్చుమీరుతున్న విద్వేషం, దెబ్బతింటున్న మత సామరస్యంపైనే చర్చించాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
వార్తాసంస్థ: డెక్కన్ హెరాల్డ్
తేదీ: ఏప్రిల్ 12
చర్చించిన అంశం: దస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింగానంద్ ముస్లింలే లక్ష్యంగా ఇటీవల చేసిన వ్యాఖ్యలను పత్రిక ఖండించింది. బెయిల్పై ఉన్నప్పటికీ, విద్వేషాన్ని రగిలిస్తున్న ఇతనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడింది. ప్రధాని మోదీని విమర్శించే వారికి బెయిల్ దొరకదని, అయితే, హిందూత్వ నేతలు ఏంచేసినా ఏమీ కాదని ధ్వజమెత్తింది.
వార్తాసంస్థ: ది టెలిగ్రాఫ్, ట్రిబ్యూన్
తేదీ: ఏప్రిల్ 12
చర్చించిన అంశం: ముస్లింలే లక్ష్యంగా ‘హలాల్ మాంసం’పై హిందూత్వ గ్రూపులు ప్రచారాన్ని ముమ్మరం చేసినట్టు టెలిగ్రాఫ్ సంపాదకీయం పేర్కొంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోలేదని మండిపడింది. ఆకలి చావులతో ఒకవైపు దేశం అల్లాడుతుంటే.. ఆహార ఉత్పత్తులపై హలాల్ సర్టిఫికెట్లు ముద్రించాలంటూ బీజేపీ నేతలు ప్రచారం చేయడాన్ని ప్రమాదకర పరిణామంగా ట్రిబ్యూన్ అభివర్ణించింది.
వార్తాసంస్థ: ఇండియన్ ఎక్స్ప్రెస్
తేదీ: ఏప్రిల్ 13
చర్చించిన అంశం: గత ఆదివారం శ్రీరామనవమిరోజు ఆరు రాష్ర్టాల్లో జరిగిన అల్లర్లతో పాటు కర్ణాటకలో ఇటీవల వివాదాస్పదమైన హిజాబ్, హలాల్ తదితర అంశాలపై సంపాదకీయంలో చర్చ సాగింది. మతఘర్షణలు జరుగుతున్న రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, విద్వేషవ్యాఖ్యలు చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని పత్రిక తూర్పారబట్టింది.
వార్తాసంస్థ: ఫ్రీ ప్రెస్ జర్నల్
తేదీ: ఏప్రిల్ 13
చర్చించిన అంశం: శ్రీరామనవమి రోజు జరిగిన అల్లర్లలో పోలీసులపై రాళ్లు రువ్వారంటూ కొందరు అనుమానితుల ఇండ్లను మధ్యప్రదేశ్ అధికారులు కూల్చడాన్ని పత్రిక తప్పుబట్టింది. సాక్ష్యాలు లేకుండా, నిజనిరూపణ కాకుండా, దోషులని తేలకుండా బీజేపీ ప్రభుత్వం అత్యుత్సాహం చూపించిందని మండిపడింది. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బెదిరింపులను కూడా ప్రస్తావించింది.
వార్తాసంస్థ: హిందుస్థాన్ టైమ్స్
తేదీ: ఏప్రిల్ 11
చర్చించిన అంశం: శ్రీరామనవమి రోజు జేఎన్యూ వర్సిటీలో రెండు గ్రూపుల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసుల జోక్యాన్ని పత్రిక తప్పుబట్టింది. విద్యార్థులు క్రిమినల్స్ ఏమీ కాదని పేర్కొన్నది. దేశంలోని వైవిధ్యతకు ప్రతిబింబంగా నిలిచే జేఎన్యూలోని హాస్టల్స్లో భిన్న ప్రాంతాల స్టూడెంట్స్ ఉంటారని, వెజ్, నాన్-వెజ్ ఆహారాన్ని సరఫరా చేయడం సాధారణమేనని వెల్లడించింది.
వార్తాసంస్థ: టైమ్స్ ఆఫ్ ఇండియా
తేదీ: ఏప్రిల్ 11
చర్చించిన అంశం: హిందూ ఆలయ పరిసరాల్లో వ్యాపారం చేయడానికి ముస్లింలకు అనుమతి లేదంటూ హిందూత్వ సంస్థలు చేస్తున్న వాదనను కర్ణాటక ప్రభుత్వం సమర్థించడాన్ని పరోక్షంగా ఎత్తిచూపుతూ సంపాదకీయంలో చర్చ సాగింది. ఒక వర్గం అలోచనలను మరో వర్గంపై రుద్దడం సరికాదని, ఆర్థికపరంగానూ ఇది మంచిదికాదని పేర్కొంది.