Arunachal Pradesh : భారతదేశంలోని ప్రాంతాల పేర్లను మారుస్తూ, తన భూభాగంగా పేర్కొంటూ చైనా అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం ఖండించింది. చైనా చేస్తున్న ఇలాంటి చర్యలు వాస్తవాల్ని కప్పిపుచ్చలేవని తెలిపింది. ఇండియా విషయంలో చైనా ఎప్పుడూ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇండియాలోని ప్రదేశాల్ని చైనా తన భూభాగంగా చూపిస్తూ ఉంటుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాలను కూడా తన దేశంలోని ప్రదేశాలుగా పేర్కొంది. ఇటీవల కొన్ని ప్రదేశాలకు కొత్త పేర్లు పెట్టింది.
ఇటీవల లదాఖ్లోని రెండు ప్రదేశాలను హీన్, హెకాంగ్ అంటూ చైనా తన భూభాగంగా పేర్కొంది. కానీ, చైనా అనుసరిస్తున్న ఈ వైఖరిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. చైనా తీరును తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక ప్రకటన చేశారు. చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘భారత సరిహద్దులోని ప్రదేశాల విషయంలో పేర్లు మారుస్తూ చైనా చేస్తున్న ఇలాంటి తప్పుడు పనుల్ని ఇండియా ఖండిస్తోంది. తప్పుడు ఉద్దేశాలతో చైనా చేసే ఇలాంటి పనులు వాస్తవాల్ని దాచి ఉంచలేవు. అరుణాచల్ ప్రదేశ్ సహా సరిహద్దు ప్రదేశాలు ఇండియాలో భాగం అనే సత్యాన్ని కాదనలేం. ఇవి సమగ్రమై, ఇండియా నుంచి విడదీయలేని ప్రదేశాలు. చైనా చేస్తున్న ఇలాంటి పనులు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చేస్తున్న చర్యలకు అడ్డంకిగా మారుతాయి.
రెండు దేశాల మధ్య పరస్పర అవగాహనకు ఆటంకం కలిగించకుండా ఆ దేశం ఇలాంటి పనుల్ని నివారించాలి’’ అని రణధీర్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దు అంశంలో ఇండియా-చైనా మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో లదాఖ్లో జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య మరిన్ని ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ తర్వాత చర్చల ద్వారా వివాదం కొంత సద్దుమణిగింది.