న్యూఢిల్లీ : క్రిమియా వంతెనపై పేలుడు అనంతరం ఉక్రెయిన్పై దాడులు మరింత పెంచింది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై సోమవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం, ఘర్షణలు పెరగడంపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. వంతెనపై పేలుడు తర్వాత ఉక్రెయిన్ నగరాలపై రష్యా రాకెట్ దాడులతో విరుచుకుపడింది. కీవ్తో పాటు ఉక్రెయిన్ నగరాలు రష్యా దాడులతో దద్దరిల్లాయి. కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా దాడికి పాల్పడిందని, దీంతో ఉక్రెయిన్లో అనేక ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఇరుదేశాలు శత్రుత్వాన్ని వీడి.. తక్షణమే దౌత్యం, చర్చల మార్గాన్ని అనుసరించాలని ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఘర్షణలు పెరుగడం ఎవరికీ మంచిది కాదని భారత్ పునరుద్ఘాటిస్తుందని, ఇరుదేశాలు చర్చలకు రావాలని కోరుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. మరో వైపు ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు పెంచిన నేపథ్యంలో ఉక్రెయిన్కు వెలుపల భారతీయులు అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించింది. అలాగే ఎప్పటికప్పుడు తమ ఉనికిని ఎంబసీకి తెలియజేయాలని కోరింది.