క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. మొదటి స్టూడెంట్ టాపర్. అన్ని సబ్జెక్టుల్లో నూటికి 90 మార్కులు వస్తాయి. రెండో విద్యార్థికి పాస్ మార్కులు రావడమే కష్టం. దీంతో ఉపాధ్యాయుడు ఒక నిబంధన పెట్టాడు. వెనుకబడిన విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 90 మార్కులు వచ్చేవరకూ చురుకైన విద్యార్థి ఎక్కువ మార్కులు తెచ్చుకోకూడదు. అని ! ఇదేం నిబంధన!!
..చక్కగా చదువుతూ వృద్ధిలోకి వస్తున్న చురుకైన విద్యార్థికి అసంబంద్ధ కండీషన్లు పెట్టి కళ్లెం వేస్తారా? మతి ఉన్న చర్యేనా?’ అనాలనిపిస్తుందా??
ఉత్తరాదిపై అమిత ప్రేమను చూపిస్తూ, దక్షిణాది రాష్ర్టాలపై వివక్షను చూపించే కేంద్రంలోని బీజేపీ సర్కారు మరో ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకొచ్చింది. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో సంచలనాలు సృష్టిస్తున్న తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాల దూకుడుకు కళ్లెం వేస్తున్నది. యూపీ, బీహార్ వంటి రాష్ర్టాల్లో వైద్యసదుపాయాలు మెరుగయ్యేంతవరకూ దక్షిణాదికి కొత్త మెడికల్ కాలేజీలను, అదనపు సీట్లను మంజూరుచేయబోమని ఒక రకంగా తెగేసి చెప్పింది.
‘నేను బాగుపడను.. ఎదుటివాన్ని బాగుపడనివ్వను’ అన్నట్టుగా ఉన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు. తనకు రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా తిరస్కరిస్తున్న దక్షిణాది రాష్ర్టాలపై బీజేపీలో పేరుకుపోయిన కక్ష, పగ మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ర్టాల పన్ను సొమ్మునంతా ఉత్తరాదిలో ఖర్చుపెడుతున్న మోదీసర్కారు.. ఇప్పుడే ఏకంగా ఇక్కడి ప్రగతిని అడ్డుకునే కుట్రలకు తెరలేపింది. దక్షిణాదిలో వైద్యవిద్యపై గురిపెట్టింది. తన చేతిలో కీలుబొమ్మగా ఉన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎంఎంసీ) ద్వారా దక్షిణాది రాష్ర్టాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటుకాకుండా ఆదేశాలు జారీ చేయించింది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఇకపై కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేయటానికి వీల్లేదు. అందుకు ఆ సంస్థ చెప్పిన కారణం.. ఈ రాష్ర్టాల్లో ఇప్పటికే వైద్యులు ఎక్కువైపోయారట! ఏ రాష్ట్రంలో చదివిన డాక్టర్లు ఆ రాష్ట్రంలోనే ఉం టారా? ఎందుకీ నిబంధనల బంధనాలు?
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సామాన్యులకు అందుబాటులో నాణ్యమైన వైద్యాన్ని అందించాలనుకొంటున్న తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాల ప్రణాళికలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు నీళ్లుచల్లుతున్నది. కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకురావాలనుకొంటున్న ప్రభుత్వాల నడ్డి విరిచేస్తున్నది. కొత్త నిబంధనల పేరిట ఎంబీబీఎస్ సీట్లకు కత్తెర వేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గత నెలలో జారీ చేసిన సర్క్యులరే దీనికి నిదర్శనం. ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేలా నిబంధనలు పాటించాలని ఆ సర్క్యులర్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధన గనుక అమలైతే దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగనున్నది. ఇప్పటికే కేంద్రం పెట్టిన పరిమితిని దాటి ఆయా రాష్ర్టాల్లో ఎంబీబీఎస్ సీట్లు ఉండటంచేత కొత్త కాలేజీల స్థాపన జరుగాలంటే కొన్ని దశాబ్ధాలు వేచిచూడాల్సిన దుస్థితి దాపురించవచ్చు. మెడికల్ కాలేజీల్లో అదనపు సీట్ల పెంపు కూడా గగనమే.
మంచి చేయాలనుకొంటే..
దేశప్రగతిని వైద్యారోగ్య సదుపాయాలను బట్టి నిర్ధారిస్తారు. ఈ విషయాన్ని గ్రహించే తెలంగాణ వంటి దక్షిణాది రాష్ర్టాలు ఆరోగ్య రంగానికి అమిత ప్రాధాన్యాన్ని ఇస్తూ మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపును యుద్ధప్రాతిపదికన పూర్తిచేశాయి. దీంతో ఆయా రాష్ర్టాలు దవాఖానల కార్ఖానాలుగా మారాయి. అయితే యూపీ, బీహార్ వంటి అత్యధిక జనాభా కలిగిన రాష్ర్టాల్లో పరిమితి కంటే అత్యంత తక్కువగా మెడికల్ సీట్లు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ ఇటీవల లోక్సభలో చెప్పుకొచ్చారు. 23.5 కోట్ల జనాభా ఉన్న యూపీలో నిబంధనల ప్రకారం.. 23,568 ఎంబీబీఎస్ సీట్లు కావాల్సి ఉండగా, కేవలం 9,703 సీట్లు మాత్రమే ఉన్నట్టు వెల్లడించారు. ఎన్ఎంసీ నిబంధనలతో పోలిస్తే దక్షిణాది రాష్ర్టాల్లో మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయంటూ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే ఎన్ఎంసీ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. జనాభా, సీట్ల నిష్పత్తిని పాటించాలని చెబుతూ.. యూపీ, బీహార్ వంటి రాష్ర్టాల్లో మెడికల్ సీట్లు తగిన పరిమితికి చేరుకునేవరకూ ఒకరకంగా దక్షిణాదికి కొత్త మెడికల్ కాలేజీలను, అదనపు సీట్లను మంజూరు చేయబోమని పరోక్షంగా తెగేసి చెప్పింది. అయితే, వైద్యారోగ్యరంగం, మెడికల్ కాలేజీల ఏర్పాటు పూర్తిగా రాష్ర్టాల వ్యవహారమని, దీంట్లో కేంద్రం ఏకపక్షంగా జోక్యం చేసుకోవడం సమాఖ్యస్ఫూర్తిని కాలరాయడమేనని నిపుణులు మండిపడుతున్నారు.
డాక్టర్ల నిష్పత్తి పట్టించుకోరేం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిబంధనల ప్రకారం.. ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. అయితే, భారత్లో ప్రతీ రెండు వేల మంది జనాభాకు ఒక వైద్యుడు కూడా సరిగ్గా లేడు. యూపీ, బీహార్ వంటి పెద్ద రాష్ర్టాలే దీనికి కారణం. అయితే, ఈ అంతరాన్ని కొంతలో కొంత పూడ్చుతున్నవి దక్షిణాది రాష్ర్టాలే. ఎన్ఎంసీ గణాంకాల ప్రకారం.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాల్లో ప్రతీ 500-800 మందికి ఒక వైద్యుడు ఉన్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఏకపక్ష నిర్ణయంతో కొత్త మెడికల్ కాలేజీలు, తద్వారా సమాజంలోకి వైద్యుల రాక కలగా మారిపోనున్నది.
పాక్ కంటే దారుణంగా..
‘డబ్ల్యూహెచ్వో చేసిన సిఫారసు కంటే దేశంలో వైద్యుల సంఖ్య ఎంతో మెరుగ్గా ఉన్నది. ప్రతీ 854 మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నారు’ అంటూ కిందటేడాది జూలైలో కేంద్రం పార్లమెంట్కు తెలియజేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేంద్రం వెల్లడించిన డాటా కేవలం పట్టణాలకే పరిమితంగా ఉన్నది. దేశంలోని మూడొంతుల జనాభాలో రెండొంతుల మంది నివసిస్తున్న గ్రామీణప్రాంతాల్లో కేవలం 27% మంది వైద్యులే అందుబాటులో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ లెక్కన దేశంలో సగటున ప్రతీ 2 వేలమందికి ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేరు. ఇదే సమయంలో పాకిస్థాన్లో ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నట్టు ప్రపంచబ్యాంక్ తాజా గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణ బిడ్డకు 60 ఏండ్ల నిరీక్షణేనా?!
కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. తెలంగాణ జనాభా 3.8 కోట్లుగా తీసుకొంటే.. ఎంబీబీఎస్ సీట్ల పరిమితి 3,809గానే ఉంటుంది. అయితే, వైద్యరంగంలో కేసీఆర్ సర్కారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో ఎంబీబీఎస్ సీట్లు 8,515కి పెరిగాయి. అంటే, కేంద్రం డిసైడ్ చేసిన మార్క్ కంటే తెలంగాణలో 4,706 సీట్లు (123 శాతం) ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కొత్త నిబంధనలు అమలైతే.. తెలంగాణ జనాభా 8.5 కోట్లు చేరేవరకూ కొత్త మెడికల్ కాలేజీలను, అదనపు సీట్లను మంజూరు చేయకపోవచ్చు. అంటే, కొత్త మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ ప్రజానీకం ఇంకో 60 ఏండ్లు వేచిచూడాలన్న మాట.
వెయ్యి మందికి ఎంతమంది డాక్టర్లంటే?.. ఏ దేశాల్లో ఎలా??
క్యూబా : 8.4
ఇటలీ : 8
జార్జియా : 7.1
ఫ్రాన్స్ : 6.5
బ్రిటన్ : 5.8
జర్మనీ : 4.3
న్యూజిలాండ్ : 3.4
అమెరికా : 2.6
పాకిస్థాన్ : 1.9
భారత్ : 0.5
ఆమోదనీయం కాదు
ఒక రాష్ట్రంలో వైద్య విద్యనభ్యసించిన వ్యక్తి.. అక్కడే వైద్యుడిగా విధులు నిర్వహిస్తాడని ఎలా చెప్పగలం? తెలంగాణలో చదువుకొన్న వ్యక్తి, యూపీలో ప్రాక్టిసింగ్ చేయవచ్చు కదా. ఇలాంటి సమయంలో జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్ల పరిమితిని తీసుకురావడం ఏ మాత్రం ఆమోదనీయం కాదు.
– డాక్టర్ సుధీర్ కుమార్, న్యూరాలజిస్ట్, హైదరాబాద్
రాష్ర్టాల హక్కులను కాలరాయడమే!
మోదీ ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. కేంద్రం దాని ఏజెన్సీలు సమాఖ్యస్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. తమ విద్యార్థులు చదువుకోవడానికి రాష్ర్టాలు సొంత నిధులతో కొత్త మెడికల్ కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? రాష్ర్టాల హక్కులను, అధికారాలను ఇది కేంద్రం హరించడమే అవుతుంది.
– పీ చిదంబరం, కాంగ్రెస్ నేత
కొత్త నిబంధనలు అమలైతే, కొత్త కాలేజీ స్థాపనకు ఏ రాష్ట్రం ఎన్నేండ్లు వేచిచూడాలంటే??
రాష్ట్రం : వేచిచూడాల్సిన వ్యవధి
తెలంగాణ : 60 ఏండ్లు
కర్ణాటక : 55 ఏండ్లు
తమిళనాడు : 40 ఏండ్లు
కేరళ : 12 ఏండ్లు
ఆంధ్రప్రదేశ్ : 10 ఏండ్లు