Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (liquor policy case)లో ఈడీ ( Enforcement Directorate ) ముందు విచారణకు హాజరు కావడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి నిరాకరించారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ ఆరుసార్లు జారీ చేసిన నోటీసులను ఆయన లెక్క చేయలేదు. తాజాగా ఏడోసారి జారీ చేసిన సమన్లను కూడా బేఖాతరు చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేసింది.
ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది. ‘ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఓపిక పట్టాలి. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలి’ అని ఆప్ పేర్కొంది.
కాగా, ఈడీ ఇప్పటివరకు పలుసార్లు సమన్లు జారీ చేయగా, కేజ్రీవాల్ వాటిని చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఢిల్లీ బడ్జెట్ సమావేశాల వల్ల కోర్టు విచారణకు కేజ్రీవాల్ హాజరు రాలేకపోయారు. దీంతో కోర్టు విచారణ మార్చి 16కు వాయిదా పడింది.
కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరుసార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆరుసార్లూ ఆయన ఈడీ విచారణకు నిరాకరించారు. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. పైగా ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీన ఏడోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే, ఈ నోటీసులను కూడా కేజ్రీ బేఖాతరు చేశారు. ఈరోజు కూడా విచారణకు కేజ్రీవాల్ హాజరుకావడంలేదని ఆప్ పేర్కొంది.
Also Read..
RTC Bus | లారీ టైర్ పంక్చర్ వేస్తుండగా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి
Gruha Jyoti | హైదరాబాద్లో 11 లక్షల మందికే గృహజ్యోతి?
Congress | పెత్తనం ఎవరిది.. నిజామాబాద్లో రసకందాయంగా మారుతున్న హస్తం రాజకీయం