న్యూఢిల్లీ: బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతిచెందిన కేసులో పోలీసులు కీలక అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ కేసులోని ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని రామ్ బాబు మహతోగా గుర్తించారు. సరన్ జిల్లాలోని డోయిలా అతని స్వగ్రామం. నిందితుడు మహతో ఢిల్లీలో దాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని క్రైం బ్రాంచ్ కమీషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.
టెక్నికల్ నిఘా, ఆ తర్వాత నిర్దిష్ట సమాచారం ఆధారంగా మహతోను ద్వారక ప్రాంతంలో పట్టుకున్నట్లు యాదవ్ వెల్లడించారు. నిందితుడు మహతోను అరెస్టు చేసిన విషయాన్ని బీహార్ పోలీసులకు తెలియజేసినట్లు ఢిల్లీ కమీషనర్ తెలిపారు. బీహార్లో మద్య నిషేధం ఉందని, అయితే ఆ అవకాశాన్ని వాడుకుని, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నిందితుడు కల్తీ మద్యం అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.