Mumbai-Pune Expressway : ముంబై-పూనే ఎక్స్ప్రెస్ వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. దాదాపు 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. మొత్తం 18 గంటలుగా తమ వెహికల్స్ ఆగిపోయినట్లు వాహనదారులు చెబుతున్నారు. ముంబై-పూనే ఎక్స్ప్రెస్ వేపై, రాయ్ఘడ్ జిల్లాలోని, ఖండాలా ఘాట్ వద్ద మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది.
అందులోంచి గ్యాస్ కొద్దిగా లీకైంది. అది ప్రమాదకర ప్రొపైలైన్ గ్యాస్. అది లీకై, మంటలు అంటుకున్నా, పేలిపోయినా చాలా ప్రమాదకరం. అందుకే వెంటనే స్పందించిన అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ఆ దారిలో వాహనాల్ని నిలిపివేశారు. దీంతో రోడ్డుపై వాహనాలు క్రమంగా నిలిచిపోతూ వచ్చాయి. ఘటనా స్థలానికి ట్రాఫిక పోలీసులతోపాటు ఎమర్జెన్సీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అలాగే బీపీసీఎల్ బృందం కూడా పని చేస్తోంది. అది ప్రమాదకర గ్యాస్ కావడంతో ఆ ట్యాంకర్ను అంత సులభంగా అక్కడినుంచి తరలించడానికి వీల్లేదు. పైగా అది లీకవుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా వాహనం నుంచి గ్యాస్ తొలగిపోయేలా చూస్తున్నారు. బుధవారం ఉదయానికి 50 శాతం గ్యాస్ తొలగించారు.
ఇంకా గ్యాస్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో 12 కిలోమీటర్ల మేర, 18 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలకు సంబంధించిన డ్రైవర్లు, క్లీనర్లు వంటి వాళ్లు రోడ్లపైనే వంట చేసుకుంటున్నారు. ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యవసరమైతే తప్ప ఈ రూట్లో రాకూడదని సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ అధికారులు ఇతర మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. పాత హైవే దారిలో వాహనాల్ని మళ్లించారు.