ముంబై, మే 11 : ‘ప్రజలు పొదుపు పాటించాలి.. ఏడాది దాకా బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల కొరత తీవ్రంగా ఉంటుంది.. విదేశీ మారకద్రవ్యం అడుగంటుతున్నది.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది’ అంటూ ఆదివారం ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా సోమవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ప్రభావం దేశీయ దిగుమతులపై తీవ్రంగా పడనున్నదన్న అంచనాలతో పాటు స్వయంగా ప్రధాని పొదుపు మంత్రం పాటించాలని ప్రజలకు పిలుపు నివ్వడం మదుపర్లలో ఆందోళన పెంచింది.
వీటికి తోడు రూపాయి పాతాళంలోకి పడిపోవడం కూడా నష్టాలను మరింత పెంచాయి. ఇంట్రాడేలో 1,300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,312.91 పాయింట్లు లేదా 1.70 శాతం నష్టపోయి 76,015.28 పాయింట్లకు జారుకున్నది. మరోసూచీ నిఫ్టీ సైతం 24 వేల కీలక మైలురాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 360.30 పాయింట్లు లేదా 1.49 శాతం కోల్పోయి 23,815.85 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో లక్షల కోట్ల మదుపర్ల సంపద హారతికర్పూరంలా కరిగిపోయింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.8.9 లక్షల కోట్లు కరిగిపోయి రూ.384.22 లక్షల కోట్లకు పడిపోయింది.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలంటే ఇరాన్ ప్రతిపాధించిన అంశాలు ఆమోదయోగ్యంగా లేవని, దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేయడంతో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకునే అవకాశాలుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారి అలజడికి గురయ్యాయని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు భారతీయులు పొదుపు ఎజెండాగా పలు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బంగారం, చమురు, వంటనూనెల వాడకాన్ని తగ్గించాలని మోదీ సూచనలు మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయని జియోజిట్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ టూర్లు తగ్గించుకోవాలని, ఇంధన వాడకాన్ని నియంత్రించుకోవాలని మోదీ సూచనలు చేసిన ఒక్కరోజులోనే ఆయా రంగాల్లో షేర్లు 5 శాతం కూప్పకూలాయి.