జైపూర్: వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ‘రాసి పెట్టుకోండి.. వచ్చే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్ పార్టీ గద్దె దించుతుంది’ అని వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో కలిసి రాహుల్గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గరపడటంతో బీజేపీ కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని, వ్యక్తిగతంగా తనను అపఖ్యాతిపాలు చేసేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం జరుగుతున్నదని విమర్శించారు. ఇలాంటి చెడగొట్టు ఆలోచనలు బీజేపీకే వస్తాయని రాహుల్గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని, నియంతృత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. అదేవిధంగా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వివాదంపై కూడా రాహుల్ స్పందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కొన్నికొన్ని సార్లు అపార్థాలు చోటుచేసుకుంటాయని, అది పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానించారు.