లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పురుషుల సంక్షేమం కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (మర్ధ్) హామీ ఇచ్చింది. 2018లో ఈసీ వద్ద నమోదైన మర్ధ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లక్నో, వారణాసి స్ధానాల నుంచి పోటీ చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ బరేలి, లక్నో నార్త్, హందియా, చౌరి-చౌరా స్ధానాల నుంచి అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. మర్ధ్ అంటే హిందీలో పురుషుడు అని అర్ధం. యూపీ ఎన్నికల్లో తాము అధికార పగ్గాలు చేపడితే పురుషుల సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ పురుష కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ హామీలు గుప్పిస్తోంది.
జాతీయ పురుష కమిషన్ ఏర్పాటుతో విధాన నిర్ణయాల్లో పురుషుల సమస్యలను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు కలుగుతుందని మర్ధ్ జాతీయ అధ్యక్షుడు కపిల్ మోహన్ చౌధరి తెలిపారు. పార్టీ మేనిఫెస్టోలో పురుషుల ఉన్నతి, భద్రత, ప్రతిష్ట కోసం పలు హామీలను పొందుపరుస్తామని చెప్పారు. పురుషుల భద్రత చట్టం తీసుకువస్తామని, పురుషుల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాము మహిళా సాధికారతకు వ్యతిరేకం కాదని అయితే జనాభాలో సగభాగమైన పురుషుల హక్కులు, వారి సమస్యల పట్ల సానుభూతి కనబరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా సాధికారత పేరుతో పురుషులను వేధించడం మొదలైందని, దాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
విద్య వంటి సానుకూల అంశాలతో కూడిన మహిళా సాధికారతను తాము స్వాగతిస్తామని చెప్పారు. కాంగ్రెస్ నినాదం లడ్కీ హు..లడ్శక్తీ హు స్లోగన్ను చౌధరి వ్యతిరేకించారు. మహిళలను ప్రసన్నం చేసుకునే పేరుతో పురుషులను నిందించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్ధాయిలో తాము దాదా-దీదీ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విధానంతో పిల్లలు మొబైల్ ఫోన్ల సంస్కృతికి దూరమై అమ్మమ్మ, తాతయ్యల ఒడిలో చేరతారని తెలిపారు. వృద్ధుల ఒంటరితనం పోగొట్టేందుకు ఇది ఉపకరిస్తుందని అన్నారు. ఉమ్మడి కుటుంబ సంప్రదాయాలను పటిష్టం చేసేందుకు చర్యలు చేపడతామని మర్ధ్ చీఫ్ స్పష్టం చేశారు.