Maharashtra | మరాఠా రిజర్వేషన్ డిమాండ్తో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సొలంకేతో పాటు మున్సిపల్ కౌన్సిల్ భవనానికి రిజర్వేషన్ పోరాట సమితి మద్దతుదారులు నిప్పు పెట్టారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజల్గావ్లో మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, దాడి జరిగిన సమయంలో ఎమ్మెల్యే ప్రకాశ్తో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.
ఎవరికీ ఏం జరుగలేదని.. అందరు సురక్షితంగా బయటపడ్డారని, భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ఎమ్మెల్యే వివరించారు. నిరసనకారులు భవనంలో మొదటి అంతస్తులో నిప్పు పెట్టగా.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ భవనానికి సైతం నిప్పు పెట్టిన వారిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గంగాపూర్లో మరాఠా కోటా మద్దతుదారులు బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయం కిటికీలు, ఫర్నీఛర్ను ధ్వంసం చేయగా.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అయితే, మరాఠా కమ్యూనిటీకి విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రెండోవిడత చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. జాల్నా జిల్లా అంతర్వాలి సార్తి గ్రామంలో రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే ఈ నెల 25 నుంచి నిరవధిక నిరహార దీక్ష చేస్తున్నారు. అయితే, ఆందోళన నేపథ్యంలో గత 48 గంటల్లో 13 ఆర్టీసీ బస్సులు దెబ్బతిన్నాయి. 30 డిపోల పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శంభాజీనగర్ డివిజన్లోని బీడ్, ధారాశివ, శంభాజీనగర్ మినహా అన్నిచోట్ల డిపోలు మూతపడ్డాయి.