న్యూఢిల్లీ: కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రేపు (జనవరి 10న) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఈ సందర్భంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 6.00 గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుక్ మాండవీయ కూడా దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటం, ఈ విస్తృతిపై కేంద్ర వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే ప్రణాళిక సిద్ధమవుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేపు జరిగే ఆరోగ్య మంత్రుల సమావేశంలో లాక్డౌన్ ఉంటుందా.. లేదా..? అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.