Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో 76వ సభ జరుగుతుండగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీని అంచనా వేసే టూల్ను అభివృద్ధి చేసిన ఏకైక దేశం భారత్ అని తెలిపారు. భారత్లో టీబీ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. 2015 నుంచి 2022 వరకు దేశంలో 13శాతం క్షయ కేసులు నమోదయ్యాయని, మరణాల రేటు 15శాతం తగ్గింది. ప్రపంచ స్థాయిలో పోల్చిన సమయంలోనూ మరణాల రేటు దాదాపు 5.9శాతం తగ్గింది. ప్రపంచంలోనే టీబీ కేసులను అంచనా వేసేందుకు సొంతంగా వ్యవస్థను రూపొందించుకున్న ఏకైక దేశం భారత్ అన్న ఆయన, ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక నివేదిక కంటే చాలా ముందుగానే భారత్ ఖచ్చితమైన సంఖ్యను తెలుసుకోగలదని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే ఐదేళ్ల ముందు.. 2025 నాటికి టీబీని నిర్మూలించే ప్రయత్నంలో భారతదేశం అంకితభావం పని చేస్తుందన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు 1.5లక్షలకుపైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా దేశంలోని సుదూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సైతం ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీబీకి వ్యతిరేకంగా పోరాటంలో సమర్థవంతమైన వ్యాక్సిన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి నిర్మూలనకు ప్రపంచం మరింత సహకారంతో పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.