న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
Congress
7 రోజులు సంతాప దినాలు..
ఆయన మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలుపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి దించారు.