న్యూఢిల్లీ : కశ్మీర్ పండిట్ల కష్టాలపై కలత చెందని కాషాయ పార్టీ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కలత చెందుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మండిపడ్డారు. ఆ మూవీని ప్రమోట్ చేస్తున్న బీజేపీ కశ్మీరీ పండిట్లపై మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకల దాడితో కశ్మీర్ లోయను వీడిన కశ్మీర్ పండిట్లు తిరిగి స్వస్ధలాలకు వెళ్లే అవకాశం కోసం వేచిచూస్తున్నారని అన్నారు. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ కశ్మీర్ పండిట్ల కోసం ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ మూవీపై గత కొద్దిరోజులుగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఈ మూవీని ప్రజలు వీక్షించాలని కాషాయ పార్టీ కోరుతుండగా మనీష్ సిసోడియా ఆ పార్టీ తీరును ఎండగట్టారు. బీజేపీ కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించే ఆలోచిస్తోందని..కశ్మీర్ పండిట్ల దుస్ధితిపై కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కశ్మీర్ పండిట్ల మేలు కోసం ఎంతో చేశారని చెప్పుకొచ్చారు. 223 మంది టీచర్లకు సరైన పత్రాలు లేకపోయినా శాశ్వత హోదా కల్పించారని, పెన్షన్ వ్యవస్ధను క్రమబద్ధీకరించారని, ఢిల్లీలో కశ్మీర్ పండిట్లకు ఒక్కొక్కరి నెలకు రూ 3000 నగదు అందిస్తున్నారని తెలిపారు. కాగా కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్ను మినహాయింపు అంశంపై కేజ్రీవాల్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.
కశ్మీర్ ఫైల్స్ సినిమాను యూట్యూబ్లో పెడితే అందరూ ఉచితంగా చూస్తారని వ్యాఖ్యానించారు. ఈ మూవీ ద్వారా సమకూరిన వసూళ్లను కశ్మీర్ పండిట్ల సంక్షేమానికి వెచ్చించాలని డిమాండ్ చేశారు.కశ్మీరీ పండిట్ల బహిష్కరణ మూడు దశాబ్ధాలు దాటినా వారి సమస్యలపై సినిమా రూపొందింది మినహా వారికి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ నుంచి దూరమైన ప్రజల పట్ల తనకు సానుభూతి ఉందని అన్నారు. 32 ఏండ్ల తర్వాత వారి వెతలపై సినిమాను తెరకెక్కించారు కానీ వారికి న్యాయం మాత్రం దక్కలేదని ఇది సరైంది కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.