న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడుల అనంతరం సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు. కేజ్రీవాల్ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే తనపై ఎక్సైజ్ పాలసీ స్కామ్ను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు.
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో మంత్రిని కావడమే తాను చేసిన నేరమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఎక్సైజ్ స్కామ్ అంశం కాదని, కేజ్రీవాల్తోనే వారికి సమస్యని అన్నారు. కేజ్రీవాల్ దూకుడుకు కళ్లెం వేసేందుకే తన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారని పేర్కొన్నారు.
ఢిల్లీలో తాము చేపట్టిన ఎక్సైజ్ పాలసీ దేశంలోన మెరుగైన విధానమని మనీష్ సిసోడియా చెప్పుకొచ్చారు. ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కుట్రపూరితంగా వ్యవహరించకుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏటా రూ 10,000 కోట్లు ఆర్జించేదని వ్యాఖ్యానించారు. దేశం కోసం జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమన్న సిసోడియా కొద్దిరోజుల్లో సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు.