Manish Sisodia | తమ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తప్పుడు ఆరోపణల (false confession) పత్రంపై సంతకం చేయాలని సిసోడియాను సీబీఐ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
`మేం వాస్తవాలను బయటపెట్టాలని నిర్ణయించాం. గత ఆరు రోజులుగా మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలో ఉన్నారు. తప్పుడు ఆరోపణల పత్రంపై సంతకం చేయాలని మానసికంగా సిసోడియాను వేధిస్తున్నట్లు మాకు సమాచారం అందింది` అని సంజయ్ సింగ్ ఆదివారం మీడియాకు చెప్పారు. మనీశ్ సిసోడియా సైతం తన న్యాయవాది ద్వారా ఈ విషయమై సంకేతాలిచ్చారు.
Modi जी द्वारा उत्पीड़न इस क़दर बढ़ गया है-
जिस @msisodia के शिक्षा मॉडल की चर्चा दुनिया भर में होती है
मोदी जी की CBI कागज़ पर आरोप लिखकर ज़बरदस्ती Sign करवाने के लिए उनका मानसिक उत्पीड़न कर रही है
ये बात Manish जी और उनके वकील ने कोर्ट में कही है
– @SanjayAzadSln pic.twitter.com/jJkA8RTDHb
— AAP (@AamAadmiParty) March 5, 2023
`పేద ప్రజల కోసం పని చేసి, ప్రపంచదేశాల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తిని వేధించడం దురదృష్టకరం. ఒకవేళ అమెరికా అధ్యక్షుడి భార్య మనదేశానికి వస్తే ఢిల్లీలో మనీశ్ సిసోడియా ఆధ్వర్యంలో నిర్మించిన స్కూళ్లను చూడాలని కోరుకుంటారు. ఆయన్ను మానసికంగా వేధిస్తున్నారు. ఆరోపణలపై మీకు రాతపూర్వకంగా ఒక పేపర్ ఇస్తాం. మీరు దానిపై సంతకం చేయాలని సీబీఐ అధికారులు సిసోడియాపై ఒత్తిడి చేస్తున్నారు` అని సంజయ్ సింగ్ చెప్పారు.
ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడినట్లు ఆధారాల్లేవని, ఎందుకు (తప్పుడు ఆరోపణలు) ఒప్పుకోవాలని ఆయనను మానసికంగా వేధిస్తున్నారని సంజయ్సింగ్ ప్రశ్నించారు. `సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఆధారాలే లేవు, ఆధారాలు మిస్ అయ్యాయని వారు ఏనాడూ ప్రస్తావించలేదు. ఆయన ఇంటిపై వారు దాడులు చేశారు. కానీ ఏమీ దొరకలేదు` అని అన్నారు. దీనిపై సీబీఐ ప్రతిస్పందన తెలియాల్సి ఉంది.
సీఆర్పీసీ 161 సెక్షన్ ప్రకారం సీబీఐ రికార్డు చేసిన వాంగ్మూలాలు సంతకాలు చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు తెలిపారు. కోర్ట్ ఆఫ్ లా ముందు ఈ వాంగ్మూలాలకు ఆమోదం లభించదు. సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం మేజిస్ట్రేట్ ముందు మాత్రమే వాంగ్మూల ప్రకటన రికార్డు చేయాల్సి ఉంటుందని ఆ వర్గాల కథనం.