Manipur | న్యూఢిల్లీ : ఓ తెగకు రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ మణిపూర్లో చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుంచి మణిపూర్ నిరసనలు, ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మణిపూర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా మణిపూర్లో ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు 142 మంది మరణించారని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 5,995 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని, 6,745 మందిని కస్టడీలోకి తీసుకున్నామని తెలిపింది. ఉద్రిక్త పరిస్థితులను అదుపులో ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పింది. ఆరు కేసులను సీబీఐకి బదిలీ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది.
ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లాల్లోనే హింస అధికంగా జరిగిందని, ఈ ప్రాంతాల్లోనే 5 వేలకు పైగా ఘర్షణలు చోటు చేసుకున్నాని పేర్కొంది. మరణాలు కూడా ఈ జిల్లాల్లోనే అధికంగా చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి, శాంతి భద్రతలను కాపాడినట్లు తెలిపింది. 124 పారామిలటరీ బలగాలు, 184 ఆర్మీ బలగాలను రంగంలోకి దించినట్లు చెప్పింది.