ఇంఫాల్ : మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల్లో మారణహోమం ఆగడం లేదు. ఇప్పటికే 98 మంది మృతిచెందగా తాజాగా మరో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ తన కుమారుణ్ని ఓ తల్లి దవాఖానకు తరలిస్తుండగా ఆందోళనకారులు ఆ అంబులెన్స్ను అడ్డగించి తగలబెట్టారు. ఈ ఘటనలో తల్లీబిడ్డలతో పాటు వారి బంధువు కూడా అసువులుబాశారు. జూన్ 4న రక్షణ దళాలకు తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన కాల్పుల్లో టోన్సింగ్కు తలలో బుల్లెట్ దూసుకెళ్లింది. అంబులెన్స్లో బాలుణ్ని దవాఖానకు తరలిస్తుండగా, కొంతమంది అంబులెన్స్ను అడ్డగించి తగులబెట్టారు. అందులో ఉన్న ముగ్గురు సజీవదహనం అయ్యారు.
నెలరోజులకుపైగా అట్టుడుకుతున్న మణిపూర్ నిరసనల సెగ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తాకింది. కుకి సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు ఢిల్లీలోని అమిత్ షా ఇంటి వద్ద నిరసనలకు దిగారు. కుకి గిరిజనుల జీవితాలను కాపాడాలంటూ వారు నినదించారు.
రాష్ట్రంలో 35 రోజులకుపైగా అమలవుతున్న ఇంటర్నెట్పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ మణిపూర్ వాసులు సుప్రీం తలుపుతట్టారు. నిషేధం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మాట్లాడే హక్కును హరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో తాము ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ప్రభావానికి గురవుతున్నట్టు చెప్పారు.