ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్లో శాంతిభద్రతలు విఫలమయ్యాయని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ స్వయంగా ఒప్పుకున్నారు. మణిపూర్ హింసాకాండపై (Manipur violence) ఆయన స్పందించారు. రాజధాని ఇంఫాల్ సమీపంలోని కోంగ్బాలో తన ఇంటికి నిప్పుపెట్టి ధ్వంసం చేయడంపై నోరు విప్పారు. ఇది తెలిసి తాను చాలా దిగ్భ్రాంతి చెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ తెలిపారు. మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మీడియాతో శుక్రవారం అన్నారు.
కాగా, గురువారం రాత్రి సుమారు 1200 మంది కేంద్ర మంత్రి రంజన్ ఇంటిని చుట్టుముట్టి పెట్రోల్ బాంబులు విసిరారు. ఆ ఇంటిని తగులబెట్టడంతోపాటు ధ్వంసం చేశారు. అయితే ఆ సమయంలో కేంద్ర మంత్రి రంజన్ తన నివాసంలో లేరు. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఈ మేరకు స్పందించారు. బుధవారం కూడా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో మణిపూర్ మంత్రి నెమ్చా కిప్జెన్ అధికార నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
మరోవైపు మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నెలలో మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా ప్రకటించింది. అయితే నాగా, కుకీ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో మే 3న మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నాటి నుంచి గత నెలకుపైగా కొనసాగుతున్న అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో సుమారు 120 మందికిపైగా పౌరులు మరణించారు. 350 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారు.
అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఆ రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నది. కాగా, మణిపూర్లోశాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ స్వయంగా చెప్పారు. ఆందోళనకారులు తన ఇంటికి నిప్పుపెట్టడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.
#WATCH | "I am shocked. The law and order situation in Manipur has totally failed," says Union Minister RK Ranjan Singh, whose residence at Kongba in Imphal was torched by mob on Thursday late night. pic.twitter.com/ECHNiKkdjm
— ANI (@ANI) June 16, 2023