కోటా, ఏప్రిల్ 30: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్కు చెందిన భరత్ కుమార్ రాజ్పుట్ నీట్ ప్రవేశ పరీక్షకు గతంలో రెండు సార్లు హాజరై మే 5న జరిగే టెస్ట్కు మూడోసారి సిద్ధమవుతున్నాడు.
మంగళవారం తాను ఉంటున్న పీజీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సుమిత్ పంచల్ (20) అనే మరో విద్యార్థి కూడా తన హాస్టల్ రూమ్లో ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. గతేడాది 26 మంది ఇలా ప్రవేశ పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోగా, ఈ ఏడాది జనవరి నుంచి 9 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.