సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెం ఉద్యమ సూరీడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానాన్ని చూపింది. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బస్సు యాత్ర అడుగిడిందే తడవుగా తమ అభిమాన నాయకుడిపై పూల జల్లు కురిపించింది. నల్ల నేలపై కాలుమోపిన గులాబీ బాస్పై అభిమానాన్ని గుబాళించింది. డప్పు చప్పుళ్లతో కళాకారులు.. కోలాటాలు, నృత్యాలతో మహిళలు.. అడుగడుగునా పూలు చల్లుతూ భారీ ర్యాలీతో బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. మెడలో గులాబీ రంగు రుమాలు, తలపై టోపీ, చేతిలో బీఆర్ఎస్ పార్టీ జెండాతో ‘జయహో కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ నినాదాలను హోరెత్తించారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచే నిప్పుల కుంపటిలా ఉన్న ఎండ తీవ్రతను లెక్క చేయకుండా తండోపతండాలుగా కొత్తగూడెం త్రీటౌన్ సెంటర్కు చేరుకున్న జనం తమ అభిమాన నేత కేసీఆర్ను చూడగానే రెట్టించిన ఉత్సాహంతో ఈలలు, కేరింతలు కొట్టారు. వారి ఉత్సాహానికి రెట్టింపుగా కేసీఆర్ బస్సులో నుంచి చేయి ఊపుతూ.. అభివాదం చేశారు. అశేషంగా తరలివచ్చిన జన ప్రవాహాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించినంత సేపు చాలా ఆసక్తిగా విన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు సాగిన కేసీఆర్ రోడ్ షోలు సూపర్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.