మానకొండూర్, ఏప్రిల్ 30: దళితజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి ప్రకాశ్ తక్షణమే దళిత సమాజానికి భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని బీఅర్ఎస్ సెల్ మానకొండూర్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాడికల్ మాజీ సర్పంచ్ గంట మహిపాల్తోపాటు దళిత సంఘాల నేతలు లింగాల లక్ష్మణ్, ఎనగందుల సుదర్శన్, కనుకుంట్ల అభిలాష్ మాట్లాడారు.
కవ్వంపల్లి ప్రకాశ్ ఒక దళితుడై ఉండి దళితజాతి ఆడబిడ్డల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఊసరవెళ్లిలా పార్టీలు మార్చే కవ్వంపల్లిదే డబ్బులకు అమ్ముడు పోయే చరిత్ర అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని దళిత ఆడబిడ్డలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి, అతని సోదరుడు ప్రకాశ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, దళిత సోదరీమణులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం దాహం తో దళితులను కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వంతడ్పుల సంపత్, సంగుపట్ల మల్లేశం, వడ్లూరి శంకర్, ఈస్కుల్ల అంజయ్య, సుదర్శన్, బొజ్జ కోటిలింగం, కొమ్ము సంపత్, డప్పు తిరుపతి, ఎలుక దేవయ్య పాల్గొన్నారు.