న్యూఢిల్లీ: మణిపూర్ డీజీపీకి సుప్రీంకోర్టు(Supreme Court) సమన్లు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు ఈ కేసులో విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
మణిపూర్లో నమోదు అయిన కేసులపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టే ప్రక్రియపై అనుమానాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే దీని కోసం ప్రత్యేక మెకానిజం అవసరం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. 6500 ఎఫ్ఐఆర్ల్లో సీబీఐ విచారణ చేపట్టడం అసాధ్యమే అనిపిస్తోందని కోర్టు తెలిపింది. అలాగే రాష్ట్ర పోలీసులను విశ్వాసంలోకి తీసుకోలేమని కోర్టు వెల్లడించింది.
ప్రభుత్వ చర్యలు, విచారణ తీరుపై నిఘా పెట్టేందుకు మాజీ జడ్జీలతో కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సొలిసిటర్ జనరల్కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్జీ తెలిపారు.