న్యూఢిల్లీ: మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గురు సభ్యులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన చేస్తూ ఈ పాత్రికేయ వ్యవస్థను సీఎం రాష్ట్ర, దేశ వ్యతిరేక శక్తిగా పేర్కొనడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
గత కొన్ని నెలలుగా హింసతో అల్లాడుతున్న మణిపూర్లో మీడియా కవరేజి గురించి వచ్చిన ఆరోపణలను పరిశీలించడానికి వచ్చిన నిజ నిర్ధారణ బృందం సభ్యులు ముగ్గురితో పాటు ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తాఫాపై మణిపూర్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మణిపూర్లోని హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని తమకు ఇండియన్ ఆర్మీ సహా పలువురు పౌరుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది.