Manipur | ఇంఫాల్, అక్టోబర్ 9: మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగుల గుంపు కుకీ సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసింది. దీనికంటే ముందు అతడ్ని తీవ్రంగా కొట్టి..గాయపర్చినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన 7 సెకన్ల భయానక వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఘటనపై సోమవారం రాష్ట్ర పోలీసులు స్పందిస్తూ, ‘థౌబాల్ జిల్లాలో కొంతమంది దుండగులు మే 4న ఇద్దరు మహిళల్ని నిర్బంధించి, నగ్నంగా ఊరేగించిన రోజే ఈ ఘటన చోటుచేసుకున్నది. ఓ గుంపు అదే రోజు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. మణిపూర్లో హింస మొదలైన రెండో రోజు ఈ ఘటన చోటుచేసుకున్నది’ అని తెలిపారు.
ఈ ఘటనతో సంబంధమున్న అందర్నీ అరెస్టు చేశామని, వారిపై కేసు నమోదుచేశామని పోలీసులు వెల్లడించారు. కుకీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ గుంపు, వారిని నగ్నంగా ఊరేగించింది. థౌబాల్ జిల్లాలో మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో ఈ ఏడాది జూలైలో సామాజిక మాధ్యమంలో విడుదలైంది. ఘటన వెలుగులోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకింది. ఆనాడు ఆ ప్రాంతంలో చొరబడ్డ గుంపు మహిళలు, అమాయక పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడిందని, వ్యక్తి సజీవ దహనం చేసిన ఘటన కూడా ఆనాడు అక్కడ జరిగిందేనని పోలీసులు చెబుతున్నారు. కుకీ, మీతీ వర్గాల మధ్య మే 3న ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే.
మణిపూర్లో అసలేం జరుగుతున్నది? ప్రభుత్వముందా? జాతుల మధ్య వైరంతో ఒకరినొకరు చంపుకుంటే భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయి?.. అంటూ విపక్షాలు ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘అత్యంత బాధాకరం ఈ ఘటన. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సిగ్గుచేటు. మణిపూర్ ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు’ అని విపక్ష ఇండియా కూటమి ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేసింది. పక్క దేశాల్లో జరుగుతున్న ఘటనలపై స్పందిస్తున్న ప్రధాని మోదీకి మణిపూర్ దారుణాలు కనపడటం లేదా? అని ప్రశ్నించింది.