Manifesto | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ ‘సంకల్ప్ పత్ర’ పేరుతో, ఈ సారైనా అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఓటర్లను ఆకర్షించడానికి 14 ప్రధాన హామీలతో బీజేపీ రాగా, 25 గ్యారంటీలతో కాంగ్రెస్ పెద్ద లిస్టునే సిద్ధం చేసింది. అయితే, ఇరుపార్టీలు మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రధాంశాలు.. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించడం గమనార్హం. అధికారాన్ని చేపట్టడానికి ఇరు పార్టీలు అబద్ధపు హామీలతో ఓటర్లను బురిడీ కొట్టిస్తున్నాయని చర్చ జరుగుతున్నది.
బీజేపీ బూటకపు హామీలు ఇలా..
నిర్ణీత వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మ్యానిఫెస్టోలో హామీనిచ్చారు. అయితే, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ పదేైండ్లెనా నెరవేరలేదు. సీనియర్ సిటిజెన్లు, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకొంటామన్నారు. రైళ్లలో సీనియర్ సిటిజెన్లకు ఉండే రాయితీకి కోత పెట్టారు. మణిపూర్, యూపీ తదితర రాష్ర్టాల్లో మహిళలపై హింస పెరిగినా సర్కారు చూసీచూడనట్టు వ్యవహరించింది. పంటల మద్దతు ధర పెంచుతామన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతుల ఉసురు తీశారు. దేశ ఆర్థికవ్యవస్థను మూడో స్థానానికి చేరుస్తామన్నారు. అయితే, ధరల పెరుగుదల, నిరుద్యోగం గతంలో ఎన్నడూ చూడని స్థాయికి చేరింది. ఈ లెక్కన ఈ హామీ నెరవేరే అవకాశమేలేదు.
కాంగ్రెస్ కబుర్ల కాలక్షేపం అలా..
కేంద్రలోని 30 లక్షల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అయితే, కాంగ్రెస్పాలిత రాష్ర్టాల్లో జరిగిన పేపర్ లీకులపై మాట్లాడట్లేదు. వ్యవసాయంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేస్తామంటున్నారు. హస్తంపార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పంట బీమాకు కూడా దిక్కులేదు. దేశంలోని ప్రతి పేదింటి మహిళకు ఏటా ఒక లక్ష రూపాయల సాయం అందిస్తామన్నారు. దేశంలోని 85 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతున్నది. అంటే ఈ లెక్కన 30 కోట్ల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టు భావించాలి. కాంగ్రెస్ హామీ ప్రకారం మొత్తం దేశ బడ్జెట్లో ఏటా రూ.30 లక్షల కోట్లను ఈ ఒక్క గ్యారెంటీ కోసమే పక్కనపెట్టాలి. ఇది సాధ్యంకాదు. వచ్చే పదేండ్లలో జీడీపీని డబుల్ చేస్తామన్నారు. ప్రస్తుత వృద్ధిరేటును పరిగణలోకి తీసుకొంటే ఇది సాధ్యం కాదు.