న్యూఢిల్లీ : 23 మంది నేతలతో కూడిన కాంగ్రెస్ అసంతృప్త గ్రూప్ (జీ23) రెబెల్ వర్గం కాదని, ఇది పార్టీలో ఒక భాగమని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ స్పష్టం చేశారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో ఆయన జీ 23లో చేరారనే ప్రచారం సాగుతన్న నేపధ్యంలో అయ్యర్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ అగ్రనాయకత్వం, జీ-23 మధ్య ప్రతిష్టంభన నెలకొందనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. జీ-23 టార్గెట్ గాంధీ కుటుంబం కాదని, తమ టార్గెట్ బీజేపీయేనని ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ అయ్యర్ తేల్చిచెప్పారు. జీ-23 నేతలు, గాంధీ కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల జరిగిన సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని చెప్పారు. పార్టీ పనితీరుపై జీ-23 నేతలు చేసిన సూచనలను అగ్రనాయకత్వం పరిగణనలోకి తీసుకుందని మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ తెలిపారు.
రాహుల్ గాంధీతో జీ-23 సభ్యుడు భూపీందర్ సింగ్ హుడా సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగిందని చెప్పారు. సోనియా గాంధీతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ కూడా నిర్మాణాత్మకంగా జరిగిందని అన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి అనుగుణంగానే తమ సలహాలు, సూచనలు ఉన్నాయని పార్టీ నాయకత్వం వీటిని మెరుగైన రీతిలో స్వాగతించాయని చెప్పారు. సంస్ధాగత ప్రక్షాళనతోనే రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీని కాంగ్రెస్ దీటుగా ఎదుర్కోగలదని అన్నారు.