Road accident: సంక్రాంతి పండుగపూట తెలతెల్లవారుజామున ఘోరం జరిగింది. స్కూటీపై భార్య, కొడుకుతో కలిసి వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రక్కు ఢీకొట్టింది. దాంతో ఆ స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై వచ్చిన పలు వాహనాలు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. స్థానికులు గమనించి వాహనాలను ఆపేదాకా వారు నరకం అనుభవించారు. పంజాబ్లో జరిగిన ఈ ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం జల్పాయ్ గురి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి భార్య, తన ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి ఓ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. పార్టీ అనంతరం అర్ధరాత్రి తర్వాత ముగ్గురూ కలిసి స్కూటీపై జల్పాయ్గురికి తిరుగు ప్రయాణం అయ్యారు. వారి స్కూటీ 31వ నెంబర్ జాతీయ రహదారిపై గల దుస్ దర్గా ఏరియాకు రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది.
దాంతో స్కూటీపై ఉన్న ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. అయితే ఆ ప్రాంతమంతా దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉండటంతో వాహనదారులకు కనిపంచక వారిని తొక్కించుకుంటూ వెళ్లారు. అటుగా వెళ్తున్న పాదచారులు గమనించి వాహనాలు ఆపేదాక వారు నరకం అనుభవించారు. రక్తపు మడుగులో పడివున్న ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా తండ్రీకొడుకు ఇద్దరూ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సిలిగురిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.