ముంబై: ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. (Death Penalty) నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన అతడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2022 ఆగస్ట్లో మావల్ తాలూకాలోని కమ్షెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఒక ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కత్తితో గొంతు కోసి ఆ చిన్నారిని హత్య చేశాడు. ఇంటి వెనుక చెట్టు కింద గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టాడు.
కాగా, బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడి ఇంటి వెనుక పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడితోపాటు అతడి దుస్తులు దాచి కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు 2022 అక్టోబర్లో ఈ కేసుపై విచారణను స్థానిక కోర్టు చేపట్టింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఎనిమిది నెలల్లో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది. నేరం జరిగిన ఒక సంవత్సరం ఏడు నెలల్లోనే శిక్షలు ఖరారు చేసింది. నిందితుడికి మరణ శిక్ష, సాక్ష్యాలను దాచి, పోలీసులకు సమాచారం ఇవ్వనందుకు నిందితుడి తల్లికి ఏడేళ్లు జైలు శిక్షను కోర్టు విధించింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.